టీటీడీ సంగీత, నృత్య కళాశాలల్లో అడ్మిషన్లు.. జూన్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సంగీతం, నృత్యం మరియు సాంప్రదాయ కళలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు టీటీడీ శుభవార్త తెలిపింది. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలతో పాటు ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
టీటీడీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూన్ 2వ తేదీ నుంచి దరఖాస్తు ఫారాలు కళాశాలలో అందుబాటులో ఉంటాయి. పూర్తిచేసిన దరఖాస్తులను జూన్ 30వ తేదీ వరకు స్వీకరించనున్నారు. సంగీతం, నృత్య రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం కానుంది.
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో ఫుల్టైమ్ మరియు పార్ట్టైమ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గాత్రం, వీణ, వేణువు, వయోలిన్, నాదస్వరం, డోలు, మృదంగం, ఘటం, హరికథ, భరతనాట్యం, కూచిపూడి వంటి విభాగాల్లో శిక్షణ అందించనున్నారు. అదేవిధంగా బి.మ్యూజిక్, బి.డ్యాన్స్, విశారద, ప్రవీణ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో సర్టిఫికేట్ మరియు డిప్లొమా రెగ్యులర్ కోర్సులతో పాటు సాయంత్రం పార్ట్టైమ్ కోర్సులను కూడా నిర్వహించనున్నారు. సంప్రదాయ వాద్య కళల్లో ప్రావీణ్యం సాధించాలనుకునే వారికి ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడనున్నాయి.
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50 చెల్లించి అప్లికేషన్ ఫారం పొందవచ్చు. రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలలో చేరాలనుకునే వారు కనీసం 5వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
రెగ్యులర్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు మాత్రమే నిబంధనలకు లోబడి హాస్టల్ వసతి కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సంగీతం, నృత్యం, హరికథ మరియు వాద్య కళల్లో ప్రావీణ్యం సంపాదించాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 0877-2264597, 9848374408, 9440793205, 9642796991 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.





