టీటీడీకి రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం.. 15 యాపిల్ ట్యాబ్లు అందజేసిన మహిళా భక్తురాలు

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) మరో భారీ విరాళం అందింది. ప్రముఖ మహిళా భక్తురాలు నీరా రాడియా, భక్తుల సేవలు మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును టీటీడీకి విరాళంగా అందజేశారు. అదనంగా సుమారు రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్లను కూడా సమర్పించారు.
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ప్రత్యేక పూజల అనంతరం బస్సు తాళాలు, యాపిల్ ట్యాబ్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి దాత అందజేశారు. ఆలయ అర్చకులు వాహనానికి ప్రత్యేక ఆశీర్వాదాలు అందించగా, కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.
టీటీడీ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ట్యాబ్లు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కార్యకలాపాలకు ఉపయోగపడనున్నాయి. భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయని అధికారులు తెలిపారు.
విరాళంగా అందిన ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు దాతలతో కలిసి బస్సులో ప్రయాణించి దాని సామర్థ్యాన్ని పరిశీలించారు. తిరుమలలో భక్తులకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడంలో ఈ బస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ, తిరుమలలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు టీటీడీ కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం ధర్మరథ సేవలో 20 బస్సులు ఉండగా, అందులో 14 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తున్నాయని తెలిపారు. 21 బస్ స్టాప్ల ద్వారా ప్రతిరోజూ సుమారు 380 ట్రిప్పులు నిర్వహిస్తూ వేలాది మంది భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో మిగిలిన డీజిల్ బస్సులను కూడా దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్కు చెందిన ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తలశిల వేంకటేశ్వరరావు టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి రూ.7.50 లక్షల విలువైన ఔషధాలను విరాళంగా అందించారు. అలాగే గుంటూరుకు చెందిన డాక్టర్ అన్నం శ్రీనివాస్ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.15,00,116 విరాళం సమర్పించారు.
మరోవైపు, తిరుమలలో ఆదివారం మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.





