హనుమంత వాహనంపై దివ్య విహారం చేసిన శ్రీ గోవిందరాజస్వామి.. భక్తులకు అభయప్రదానం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై దివ్యమంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఈ విశిష్ట వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోవింద నామస్మరణలతో మాడవీధులను మారుమోగించారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన హనుమంత వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య స్వామివారి వాహనం నాలుగు మాడవీధుల్లో విహరించింది. మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడిన తిరుపతి వీధులు భక్తి వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా పురాణాల్లో విశిష్ట స్థానం పొందాడు. త్రేతాయుగంలో శ్రీరాముడికి పరమభక్తుడిగా నిలిచిన ఆంజనేయుడు శరణాగతి, సేవాభావానికి ఆదర్శంగా భావిస్తారు. బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం, నిర్భయత్వం, వాక్పటిమ హనుమత్స్మరణతో సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. ఈ నేపథ్యంలో హనుమంత వాహనంపై విహరించిన శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు శరణాగతి మహిమను చాటిచెప్పారని పండితులు వివరిస్తున్నారు.
వాహనసేవ అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకాలు చేసి విశేష పూజలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదమంత్రోచ్చారణలతో మారుమోగింది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు దివ్య దర్శనమివ్వనుండటంతో భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





