నకిలీ చెక్ స్లిప్లతో రూ.43 లక్షల మసాలా మోసం.. హైదరాబాద్లో ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్లో అంతర్రాష్ట్ర స్థాయిలో జరిగిన భారీ మసాలా వ్యాపార మోసం కేసును గోషామహల్ పోలీసులు ఛేదించారు. నకిలీ చెక్ డిపాజిట్ స్లిప్లు, తప్పుడు చెల్లింపు హామీలతో వ్యాపారులను మోసం చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ.43 లక్షల విలువైన నల్ల యాలకుల సరుకును కాజేసినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఏ2 మహ్మద్ ఇమ్రాన్ (36), ఏ3 వినోద్ కుమార్ భాటి (51), ఏ4 సంజయ్ కుమార్ భాటి (56) ఉన్నారు. వీరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన Samsung Galaxy A54, Redmi Note 5 Pro, OnePlus Nord CE2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఏ1 సయ్యదా మహినా ఫాతిమాతో పాటు ఏ5 నితిన్ అగర్వాల్, ఏ6 మీర్జా సులేమాన్ బేగ్, ఏ7 మహ్మద్ సలీం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం మహ్మద్ ఇమ్రాన్, సయ్యదా మహినా ఫాతిమా తదితరులు కలిసి బయట రాష్ట్రాల మసాలా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ చెక్ డిపాజిట్ స్లిప్లు పంపించి, చెల్లింపులు జరిగాయని నమ్మించి సరుకులు తెప్పించుకునేవారని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుత కేసులో సిక్కింకు చెందిన ఎంఎస్ అగ్రో ఫ్యూచర్ సంస్థ ప్రతినిధి బిజయ్ కుమార్ రాయ్ను నమ్మించి రూ.43 లక్షల విలువైన 2 టన్నుల నల్ల యాలకులను హైదరాబాద్కు పంపించేలా చేశారు. మే 9న చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సరుకును స్వీకరించిన నిందితులు అనంతరం బేగంబజార్లో దానిని రూ.30 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు.
నిందితుల విచారణలో వాట్సాప్ చాట్లు, రవాణా పత్రాలు, చెక్ వివరాలు, నగదు డిపాజిట్ రసీదులు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వీటి ఆధారంగా కుట్రతో పాటు ఇలాంటి మరికొన్ని మోసాల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
అరెస్ట్ చేసిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.





