భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్చల్.. గంటపాటు నిలిచిపోయిన వాహనాలు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల కారణంగా సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపు రహదారిపై సంచరిస్తూ వాహనాలను ముందుకు కదలనీయలేదు. రాత్రి సమయం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు వాహనాల్లోనే ఆగిపోయారు. కొంతమంది భయంతో వాహనాల లైట్లు కూడా ఆపేసినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు బాణాసంచా పేల్చినా మొదట అవి కదలకుండా మొండికేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో రెండు అంబులెన్సులు కూడా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడి అంబులెన్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు పంపించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో అటవీ, పోలీసు శాఖల సిబ్బంది సంయుక్తంగా చర్యలు చేపట్టి ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. అనంతరం రహదారిపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ఘటనతో భాకరాపేట ఘాట్ రోడ్డులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ రాత్రివేళల్లో ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవి జంతువులు కనిపించినప్పుడు వాహనాల నుంచి దిగరాదని, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.
కొద్ది రోజుల పాటు భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.





