టీటీడీ ఆగస్టు దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్.. మే 25న ప్రత్యేక దర్శనం కోటా రిలీజ్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

ఈ సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ మే 20 ఉదయం 10 గంటల వరకు కొనసాగనుంది. ఎంపికైన భక్తులు మే 20 నుండి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపులు పూర్తి చేస్తే టికెట్లు మంజూరు కానున్నాయి.

మే 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు 23 నుండి 25 వరకు జరిగే వార్షిక పవిత్రోత్సవాల టికెట్లు కూడా అదే రోజు విడుదల చేయనున్నారు.

వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను మే 21 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

మే 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల కానుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను టీటీడీ అందుబాటులో ఉంచనుంది.

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ప్రత్యేక ఉచిత దర్శన టోకెన్ల కోటాను మే 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 25 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటాను మే 25 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button