తిరుపతిలో మద్యం మత్తులో అనుచిత ప్రవర్తన.. ASI జి. రాములు సస్పెన్షన్, కేసు నమోదు..

తిరుపతిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ASI అనుచిత ప్రవర్తన ఘటనపై పోలీసు శాఖ వేగంగా స్పందించింది. మద్యం మత్తులో విధులకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీఎస్పీఎఫ్కు చెందిన ఏఎస్సై శ్రీ జి. రాములును ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ విషయాన్ని తిరుపతి డీఎస్పీ శ్రీ భక్తవత్సలం వెల్లడించారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించినట్లు పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రాథమిక విచారణలో తిరుమలలో ఏపీఎస్పీఎఫ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై జి. రాములు మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించినట్లు తేలిందన్నారు.
దీంతో ఏపీఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ బి.వి. రామిరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్సై రాములును తక్షణమే సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా చట్టాన్ని అమలు చేసే పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, విధి నిర్వహణలో క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ఈ ఘటనపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని డీఎస్పీ భక్తవత్సలం సూచించారు.
పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఏమాత్రం సహించబోమని, ఎవరైనా తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమేనని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.





