
శ్రీవాణి దర్శన టికెట్లపై వస్తున్న పుకార్లను నమ్మొద్దు.. టీటీడీ స్పష్టీకరణ
తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల విషయంలో సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం అవుతున్న వార్తలను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవాణి టికెట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేవని అధికారులు స్పష్టం చేశారు.
టికెట్ బుకింగ్ వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తోందని టీటీడీ వెల్లడించింది. “ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్” విధానంలోనే టికెట్లు విడుదల అవుతున్నాయని పేర్కొంది. చెల్లింపులు విఫలమైనప్పుడు లేదా బుకింగ్ పూర్తి కాకపోతే ఆ టికెట్లు తిరిగి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
కొంతమంది దళారులు భక్తులను తప్పుదారి పట్టిస్తూ అధిక ధరలకు నకిలీ టికెట్లు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని టీటీడీ హెచ్చరించింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్ లేదా అధికారిక ఛానళ్ల ద్వారానే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని కోరింది.




