సింపతీ కోసం దాడి డ్రామా.. పాస్టర్ అభినయ్ దర్శన్ హైడ్రామా బయటపెట్టిన పోలీసులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి వ్యవహారం చివరకు భారీ హైడ్రామాగా తేలింది. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ప్రచారం చేసిన ఘటన వెనుక అసలు నిజాలను పోలీసులు వెలికితీశారు. ప్రజల్లో సానుభూతి, గుర్తింపు పొందేందుకే ఈ దాడి కథను పాస్టర్ అభినయ్ స్వయంగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
గత కొన్ని రోజులుగా ‘భరోసా పార్టీ’ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్న పాస్టర్ అభినయ్ దర్శన్, తన కారుపై కొందరు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేశారని సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. ఈ దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని, గతంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ తరహాలో తనను కూడా చంపేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే దాడి జరుగుతున్న సమయంలో ప్రాణాలు కాపాడుకోవడం కంటే వీడియోలు ఎలా తీశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై తోటి పాస్టర్ల నుంచే సందేహాలు రావడంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని లోతుగా విచారణ చేపట్టారు.

దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అభినయ్ దర్శన్ ఐదుగురు సభ్యులతో కలిసి ముందుగానే ఈ దాడి నాటకానికి ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. కారు అద్దాలు ఎలా పగలగొట్టాలి, దాడి జరిగినట్లు ఎలా చూపించాలి, శరీరంపై ఎక్కడ గాయాలు చేయాలి వంటి విషయాలను స్పష్టంగా వివరిస్తూ అభినయ్ పంపిన ఆడియో మెసేజ్లు, వాట్సాప్ చాటింగ్ ఆధారాలు పోలీసులకు లభించాయి.
నిందితుల్లో ఒకరి భార్య సోషల్ మీడియా అకౌంట్ను ట్రాక్ చేయడంతో కీలక ఆధారాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ ఆధారాల ఆధారంగా దాడి కథ పూర్తిగా నకిలీ అని నిర్ధారించారు.
ప్రజల్లో సానుభూతి పొందడం, రాజకీయ లేదా వ్యక్తిగత మైలేజ్ కోసం ఈ డ్రామా ఆడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈ ఘటన పాడేరు ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి అంశాన్ని నమ్మేముందు నిజానిజాలు తెలుసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.





