తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు మే 22న అంకురార్పణ..

తిరుపతి నగరంలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు మే 22న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఘనంగా సాగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, గంగుండ్ర మండపంలో ఆస్థానం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరుపతి నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. భక్తి, శిల్పకళ, వైష్ణవ ఆగమ సంప్రదాయాల సమ్మేళనంగా వెలసిన ఈ క్షేత్రం ప్రతి రోజూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది.

స్థల పురాణం ప్రకారం, శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూలోకంలో అవతరించి వివాహం కోసం కుబేరుని వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని కొలిచే బాధ్యతను తన అన్నయ్య అయిన శ్రీ గోవిందరాజస్వామివారికి అప్పగించాడని విశ్వసిస్తారు. ధనాన్ని కొలుస్తూ అలసిపోయిన స్వామివారు ఆదిశేషునిపై శయనించిన రూపమే ప్రస్తుతం దర్శనమిస్తున్న దివ్య మూర్తిగా భావిస్తారు.
గర్భాలయంలో ఆదిశేషునిపై శయనించిన స్వామివారి దివ్య రూపం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. స్వామివారి నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించిన దృశ్యం, పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, మోక్షం కోసం తపస్సు చేస్తున్న మధు–కైటభ రాక్షసుల ప్రతిరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విశ్వరూప దర్శనం, తోమాల సేవ, అర్చన, అర్చనానంతర దర్శనం నిర్వహించగా, రాత్రి ఏకాంత సేవతో నిత్య కైంకర్యాలు ముగుస్తాయి.

భక్తులకు ఆలయంలో ఉచిత అన్నప్రసాదాల పంపిణీ కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చక్కెర పొంగలి, అన్నం, సాంబారు, రసం, కర్రీ, చట్నీ, మజ్జిగతో భోజనం అందిస్తున్నారు. అలాగే పాత మ్యూజియం వద్ద కూడా ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి నుండి సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాంబారు అన్నం, పెరుగు అన్నం కూడా అందిస్తున్నారు.
ఆలయంలోని ఏడు అంతస్తుల మహారాజగోపురం విజయనగర శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోంది. మట్ల అనంతరాజు నిర్మించిన ఈ గోపురం ద్రావిడ, విజయనగర నిర్మాణ శైలుల సమ్మేళనంగా భక్తులను ఆకట్టుకుంటోంది. బంగారు తాపడంతో మెరిసే విమాన గోపురం ఆలయ మహిమను మరింత పెంచుతోంది.
2018 ఏప్రిల్ 7న ఆలయంలో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించగా, అనంతరం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో తాపడం పనులను ప్రారంభించి, 2023 మే 25న మహాసంప్రోక్షణను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ మహాక్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి స్థానక రూపంలో, శ్రీ పార్థసారథి స్వామివారు ఆసీన రూపంలో, శ్రీ గోవిందరాజస్వామివారు శయన రూపంలో దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో నిల్చున్న, కూర్చున్న, శయనించిన విష్ణుమూర్తుల దర్శనం లభించడం ప్రపంచంలోనే అరుదైన విశేషంగా భావించబడుతోంది.
ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రత్తాళ్వార్, భగవద్రామానుజాచార్యులు, తిరుమలనంబి, అనంతాళ్వారుల సన్నిధులు భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి.
ధ్వజారోహణ మండపం, మహామండపం, అర్ధమంటపం, గర్భాలయ మండపం, వాహన మండపం, ఉత్సవ మండపాలు శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి పౌర్ణమికి నిర్వహించే గరుడసేవ, పూలంగి సేవలకు భారీగా భక్తులు తరలివస్తుంటారు.

వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, మాఘమాసంలో తెప్పోత్సవాలు, చైత్రమాసంలో వసంతోత్సవాలు, అశ్వయుజమాసంలో పవిత్రోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం, పుష్పయాగం, పొన్నకాల్వ ఉత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.
ఆలయానికి ఎదురుగా సుమారు 2.5 ఎకరాల్లో విస్తరించిన పుష్కరిణి భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ప్రతిరోజూ నిర్వహించే భక్తి, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటుండగా, ప్రతి ఏడాది జరిగే తెప్పోత్సవాలు వేలాది మంది భక్తులను రంజింపజేస్తున్నాయి.
రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలు, వైష్ణవ సంప్రదాయ మహిమ, అద్భుత శిల్ప సంపదతో వెలసిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరుపతి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.





