ఫంక్షన్ హాల్ వేటర్గా పని చేస్తూ చోరీలు.. రూ.30 లక్షల బంగారం, నగదుతో దొంగ అరెస్ట్

హైదరాబాద్లోని బేగంబజార్ పోలీసులు వరుస ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ఓ హ్యాబిట్యువల్ దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏసీపీ గోషామహల్ డివిజన్ పర్యవేక్షణలో మే 17న బేగంబజార్ పోలీసులు నిందితుడు అమర్ సోంకాంబలే (20)ను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ గ్రామానికి చెందిన అమర్ ప్రస్తుతం హైదరాబాద్లోని కిషన్బాగ్లో నివాసం ఉంటూ ఫంక్షన్ హాళ్లలో వేటర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా అతడు హైదరాబాద్ నగరంలో మూడు ఇళ్ల చోరీ కేసులు, ఒక పోక్సో కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. విలాసవంతమైన జీవనం, వ్యక్తిగత ఖర్చుల కోసం చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కేసు మే 6 తెల్లవారుజామున గోషామహల్లోని హిందీనగర్ ప్రాంతంలో జరిగింది. ఫిర్యాదుదారు శ్రీ ఎం. కృష్ణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 129/2026 కింద సెక్షన్ 331(4), 305 బీఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు విచారణలో భాగంగా బేగంబజార్ ఎస్హెచ్వోతో పాటు క్రైమ్ టీమ్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించింది. అనంతరం మే 17న అతడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి సుమారు 206 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,14,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఇన్స్పెక్టర్ శ్రీ పి. భరత్ కుమార్, డిటెక్టివ్ ఎస్ఐ శ్రీ కె. జగదీశ్వర్ రావు, బేగంబజార్ క్రైమ్ టీమ్ సభ్యులు ఛేదించారు. గోల్కొండ జోన్ డీసీపీ శ్రీ జి. చంద్ర మోహన్, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, ఏసీపీ గోషామహల్ శ్రీ కె. చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.





