ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన దుకాణదారుడికి బెదిరింపులు.. పాక్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి కాల్స్ కలకలం

పశ్చిమ బెంగాల్లోని ఝార్గ్రామ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఝల్మురి వడ్డించిన ఓ స్థానిక దుకాణదారుడు ప్రస్తుతం బెదిరింపు కాల్స్ కారణంగా భయాందోళనలకు గురవుతున్న ఘటన సంచలనంగా మారింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి తనకు కాల్స్ వస్తున్నాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఝార్గ్రామ్ ప్రాంతాన్ని సందర్శించారు. ర్యాలీ అనంతరం తిరుగు ప్రయాణంలో ఆయన కాన్వాయ్ రోడ్డు పక్కన ఝల్మురి అమ్ముతున్న బిక్రమ్ సౌ అనే వ్యాపారి దుకాణం వద్ద ఆగింది. అక్కడ బిక్రమ్ తయారుచేసిన ఝల్మురిని ప్రధాని రుచి చూసినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో ప్రధాని అతనితో కొద్దిసేపు మాట్లాడిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన తర్వాత బిక్రమ్ సౌ ఒక్కసారిగా సోషల్ మీడియాలో గుర్తింపు పొందాడు. అయితే వైరల్ అయిన కొద్ది రోజులకే తనకు విదేశీ నంబర్ల నుంచి వరుసగా కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్కు చెందిన నంబర్ల నుంచి ఫోన్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ వస్తున్నాయని, వాటిలో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నాడు.
తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారని, కొన్ని కాల్స్లో ప్రాణహాని హెచ్చరికలు కూడా ఉన్నాయని బిక్రమ్ సౌ తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయంతో ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితుడు ఇప్పటికే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అంతర్జాతీయ నంబర్ల వివరాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. కాల్స్ నిజస్వరూపంపై సాంకేతికంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఝార్గ్రామ్ ప్రాంతంలో ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒక సాధారణ దుకాణదారుడు ప్రధానమంత్రికి తినుబండారం వడ్డించిన కారణంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.





