సాక్ష్యాలు మాయం చేశాడా?.. సాయి భగీరథ్పై మరో కేసు నమోదు

తెలంగాణలో సంచలనం రేపుతున్న పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోలీసులు మరో అదనపు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన కీలక డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు గుర్తించడంతో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 238 కింద కొత్త అభియోగాలు చేర్చినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు ప్రకారం సాయి భగీరథ్ తనపై కేసు నమోదైన తర్వాత మొబైల్ ఫోన్లోని కీలక డేటాను తొలగించినట్లు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేయడం, వీడియోలు మరియు ఇతర డిజిటల్ ఆధారాలను మాయం చేసే ప్రయత్నం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. డిలీట్ చేసిన సమాచారాన్ని తిరిగి రికవరీ చేసేందుకు ప్రత్యేక డిజిటల్ ఫోరెన్సిక్ బృందాలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల సమాచారం ప్రకారం కేసు నమోదైన రోజే సాయి భగీరథ్ తన మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. అనంతరం వేరే డివైస్, కొత్త సిమ్ ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ సమయంలో ఖాళీ ఫోన్ మాత్రమే పోలీసులకు అప్పగించాడని, అసలు సిమ్ కార్డు పోయిందని చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ కేసులో పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు BNS సెక్షన్ 64(2)(M) కింద “రిపీటెడ్ రేప్” అభియోగాలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది.
ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయగా, సాయి భగీరథ్ను పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే మొదట విచారణకు హాజరు కాకపోవడంతో కేసు మరింత సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగా ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఈ కేసులో పారదర్శక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలు మరియు ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలని కూడా పలు వర్గాలు కోరుతున్నాయి.
ప్రస్తుతం సాయి భగీరథ్పై నమోదైన కేసులో పోలీసులు డిజిటల్ ఆధారాలు, ఫోన్ డేటా, సోషల్ మీడియా రికార్డులు, చాటింగ్ వివరాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.





