Delhiలో భారీ నిర్ణయం.. 2027 నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలకే అనుమతి

దేశ రాజధాని Delhiలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. Commission for Air Quality Management (CAQM) తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం 2027 జనవరి 1 నుంచి Delhiలో కొత్తగా నమోదు అయ్యే మూడు చక్రాల ఆటోలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే కావాలి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోల్, డీజిల్, CNG ఆటోలు కొనసాగినా.. కొత్త రిజిస్ట్రేషన్లకు మాత్రం EVలకే అనుమతి ఇవ్వనున్నారు.
ఈ నిర్ణయాన్ని దశలవారీగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొదటి దశలో Delhiలో అమలు కానుండగా.. 2028 నుంచి Gurugram, Noida, Ghaziabad, Faridabad, Sonipat వంటి NCR ప్రాంతాలకు ఈ నిబంధన విస్తరించనుంది. అనంతరం 2029 నాటికి మొత్తం NCR పరిధిలో కొత్తగా నమోదు అయ్యే ఆటోలు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మారనున్నాయి.
కాలుష్య నియంత్రణలో భాగంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. Pollution Under Control Certificate (PUC) లేని వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదని నిర్ణయించారు. 2026 అక్టోబర్ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాల ద్వారా వాహనాల వివరాలను తనిఖీ చేయనున్నారు. సరైన Pollution Certificate లేకపోతే పెట్రోల్, డీజిల్ లేదా CNG ఇవ్వకుండా ఆపివేస్తారు.
Delhi NCR ప్రాంతంలో వాహనాల వల్లే అధిక స్థాయిలో PM2.5 కాలుష్యం పెరుగుతోందని నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పాత ఇంధన వాహనాల వల్ల గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందని అధికారులు చెబుతున్నారు. అందుకే EV వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇక ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం పెరగడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే EVలకు సబ్సిడీలు, ప్రత్యేక పథకాలు అందిస్తుండగా.. Delhi ప్రభుత్వం కూడా కొత్త EV Policyపై దృష్టి పెట్టింది.
భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రధాన నగరాలు కూడా ఇదే తరహా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు.





