శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పరిమళాలతో నిండిన ఆలయ ప్రాంగణం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. మే 23 నుండి 31వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు సంప్రదాయబద్ధంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం దివ్య పరిమళాలతో నిండిపోయి భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది.
కార్యక్రమం పూర్తైన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రంజిత్, అర్చక బృందం పాల్గొన్నారు.






