
Justice Madhavi Devi: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై జడ్జి ఆవేదన.. కోర్టులో కీలక వ్యాఖ్యలు
తెలంగాణ హైకోర్టులో సంచలనంగా మారిన బండి సాయి భగీరథ్ పోక్సో కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవీదేవి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు విచారణ ప్రారంభానికి ముందే ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వేసవి సెలవుల బెంచ్లో భాగంగా జస్టిస్ మాధవీదేవి అనేక కేసులను విచారిస్తున్న సమయంలో ఈ బెయిల్ పిటిషన్ విచారణ రాత్రి ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. కొందరు తనను ప్రభావితం చేస్తున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తుండటం బాధాకరమని అన్నారు.
అదే సమయంలో, ఈ కేసు విచారణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని, అవసరమైతే విచారణ నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడబోనని జస్టిస్ మాధవీదేవి స్పష్టం చేశారు. దీంతో కోర్టులో కొంతసేపు గంభీర వాతావరణం నెలకొంది.
ఈ కేసులో బాధితురాలి తరఫు న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పిటిషనర్ తరఫు న్యాయవాదులు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణ కొనసాగింది. న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలు, తప్పుడు కథనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. హైకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.





