తిరుపతిలో UPSC సివిల్స్ ప్రిలిమ్స్-2026 పరీక్ష కేంద్రాల తనిఖీ.. భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై కలెక్టర్-ఎస్పీ సమీక్ష

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు–2026 నేపథ్యంలో తిరుపతిలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదివారం పరీక్ష కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం, శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలించారు. అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరీక్షా హాలుల్లో అమలు చేస్తున్న నిబంధనలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మధ్యాహ్నం నిర్వహించనున్న రెండవ పేపర్కు సంబంధించి కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, కీలక కూడళ్ల వద్ద పోలీసు సిబ్బంది మోహరింపు, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి ఏర్పాట్లను సమీక్షించారు.

పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ఎస్పీ సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సమర్థవంతమైన సమన్వయం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు.





