రూ.2.75 కోట్లతో శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు సేవలు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ప్రారంభించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ను అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక, సాంకేతిక ఆధారిత పోలీస్ సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. “Ease of Doing Governance”లో భాగంగా ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి వాటి పురోగతిని ఉన్నతాధికారులు పర్యవేక్షించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

చిన్న కేసుల నుండి ప్రధాన కేసుల వరకు ప్రతి అంశాన్ని డిజిటల్ డ్యాష్బోర్డ్ ద్వారా పరిశీలిస్తూ వేగంగా పరిష్కార చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు న్యాయం త్వరగా అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ జిల్లాలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలుస్తుందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ను అభినందించారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సులభంగా పోలీస్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
డిజిటల్ డెస్క్ విధానం ద్వారా ఫిర్యాదుల నమోదు, కేసుల పర్యవేక్షణ, విచారణ ప్రక్రియ వేగవంతమైందన్నారు. రూ.2.75 కోట్లతో నిర్మించిన ఈ భవనం ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ 2008లో ప్రారంభమైన ఈ పోలీస్ స్టేషన్కు 2018లో శంకుస్థాపన జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
సుమారు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో SHO గది, మహిళల కౌన్సెలింగ్ రూమ్, ఆధునిక కార్యాలయ విభాగాలు, డిజిటల్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చే శ్రీకాళహస్తి వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలు, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు.

శివరాత్రి వంటి భారీ ఉత్సవాల సమయంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





