తడ పోలీస్ స్టేషన్పై జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. పెండింగ్ కేసులు, పోలీసింగ్ విధానంపై కీలక ఆదేశాలు

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., తడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసింగ్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, ఎఫ్ఐఆర్ నమోదు విధానం, పెండింగ్ కేసుల వివరాలు, విజిటర్ రిజిస్టర్లు మరియు స్టేషన్ నిర్వహణ తీరును పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, ఫిర్యాదుల పరిష్కార విధానం వంటి అంశాలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.
ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే వినతులను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణ చర్యలు, బీట్ వ్యవస్థ అమలు తీరు, రాత్రి పహారా విధానాలపై కూడా సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా సిబ్బంది మరింత క్రమశిక్షణతో పనిచేయాలని, ప్రతి పోలీస్ అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని కూడా సూచించారు.
అదేవిధంగా స్టేషన్ పరిధిలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమన్వయంతో పనిచేస్తేనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ తనిఖీలో నాయుడుపేట డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





